గలతీయులు 3:1-29
-
ధర్మశాస్త్రాన్ని పాటించడానికి, విశ్వసించడానికి మధ్య తేడా (1-14)
-
నీతిమంతులు విశ్వాసం వల్ల జీవిస్తారు (11)
-
-
అబ్రాహాముకు చేసిన వాగ్దానం ధర్మశాస్త్రం ద్వారా చేసింది కాదు (15-18)
-
అబ్రాహాము సంతానం, క్రీస్తు (16)
-
-
ధర్మశాస్త్రం పుట్టుక, దాని ఉద్దేశం (19-25)
-
విశ్వాసం ద్వారా దేవుని పిల్లలు (26-29)
-
అబ్రాహాము సంతానం, క్రీస్తుకు చెందినవాళ్లు (29)
-
3 తెలివితక్కువ గలతీయులారా! మిమ్మల్ని ఎవరు మోసం చేశారు?+ యేసుక్రీస్తు మేకులతో కొయ్యకు దిగగొట్టబడడం గురించి మీకు స్పష్టంగా వివరించబడింది కదా.
2 మిమ్మల్ని ఒక విషయం అడగాలని* అనుకుంటున్నాను: మీరు పవిత్రశక్తిని ఎలా పొందారు? ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్లా, లేక మీరు విన్నవాటిని విశ్వసించడం వల్లా?+
3 మీరు ఇంత తెలివితక్కువవాళ్లా? మొదట్లో దేవుని పవిత్రశక్తికి అనుగుణంగా నడుచుకున్న మీరు, ఇప్పుడు చివర్లో మనుషుల ఆలోచన ప్రకారం నడుచుకోవాలని అనుకుంటున్నారా?+
4 మీరు ఇన్ని బాధలు అనుభవించింది ఊరికేనా? నేను అలా అనుకోవట్లేదు.
5 మీకు పవిత్రశక్తినిచ్చి, మీ మధ్య శక్తివంతమైన పనులు+ చేస్తున్న ఆయన అవన్నీ ఎందుకు చేస్తున్నాడు? మీరు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నందుకా, లేక మీరు విన్నవాటిని విశ్వసిస్తున్నందుకా?
6 అబ్రాహాము కూడా “యెహోవా* మీద విశ్వాసం ఉంచాడు, దానివల్ల దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచాడు.”*+
7 విశ్వాసం ఉన్నవాళ్లే అబ్రాహాము కుమారులని మీకు ఖచ్చితంగా తెలుసు.+
8 దేవుడు అన్యజనుల్ని విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్పు తీరుస్తాడన్న సంగతిని లేఖనం ముందే గ్రహించి, అబ్రాహాముకు ముందుగానే ఈ మంచివార్తను ప్రకటించింది: “అన్నిదేశాల ప్రజలు నీ ద్వారా దీవించబడతారు.”+
9 కాబట్టి, విశ్వాసం ఉన్నవాళ్లు విశ్వాసంగల అబ్రాహాముతో పాటు దీవించబడుతున్నారు.+
10 ధర్మశాస్త్రం మీద మాత్రమే ఆధారపడే వాళ్లందరూ శాపం కింద ఉన్నారు. ఎందుకంటే లేఖనంలో ఇలా రాసివుంది: “ధర్మశాస్త్ర గ్రంథంలో రాసివున్నవన్నీ పాటిస్తూ ఉండని ప్రతీ వ్యక్తి శాపగ్రస్తుడు.”+
11 అంతేకాదు, ధర్మశాస్త్రం ఆధారంగా ఎవరూ దేవుని ముందు నీతిమంతులుగా తీర్పు తీర్చబడరని స్పష్టమౌతోంది. ఎందుకంటే, “నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవిస్తాడు” అని లేఖనాల్లో రాసివుంది.+
12 అయితే ధర్మశాస్త్రం విశ్వాసం మీద ఆధారపడిలేదు. బదులుగా, “వీటిని* పాటించేవాళ్లు వీటి వల్ల జీవిస్తారు” అని రాసివుంది.+
13 అంతేకాదు, “కొయ్యకు వేలాడదీయబడిన ప్రతీ మనిషి శాపగ్రస్తుడు” అని కూడా రాసివుంది.+ క్రీస్తు మనల్ని ధర్మశాస్త్ర శాపం నుండి విడిపించాడు,+ మన స్థానంలో ఆయన శాపగ్రస్తుడు అయ్యాడు. అలా ఆయన మనల్ని కొన్నాడు.+
14 అబ్రాహాముకు దేవుడు వాగ్దానం చేసిన దీవెనలు క్రీస్తుయేసు ద్వారా అన్నిదేశాల ప్రజలకు రావాలని,+ మనం మన విశ్వాసం వల్ల దేవుడు వాగ్దానం చేసిన పవిత్రశక్తిని పొందాలని+ అలా జరిగింది.
15 సహోదరులారా, మనందరికీ తెలిసిన ఒక ఉదాహరణ* చెప్తాను: ఏదైనా ఒప్పందం* ఒక్కసారి స్థిరపర్చబడిందంటే, చివరికి అది ఒక మనిషి ద్వారా స్థిరపర్చబడినా సరే, ఎవరూ దాన్ని రద్దు చేయలేరు, దానికి ఏమీ కలపలేరు.
16 అబ్రాహాముకు, అతని సంతానానికి* వాగ్దానాలు చేయబడ్డాయి.+ ఆ లేఖనం, చాలామంది గురించి చెప్తున్నట్టు, “నీ వంశస్థులకు”* అని అనట్లేదు, బదులుగా ఒక్కరి గురించే చెప్తున్నట్టు, “నీ సంతానానికి”* అని అంటుంది, ఆ సంతానం క్రీస్తు.+
17 నేను చెప్పేదేమిటంటే, దేవుడు ముందుగా స్థిరపర్చిన ఒప్పందాన్ని, ఆ తర్వాత 430 సంవత్సరాలకు+ ఉనికిలోకి వచ్చిన ధర్మశాస్త్రం రద్దు చేయలేదు, వాగ్దానాన్ని కొట్టివేయలేదు.
18 దేవుడు ఇచ్చే వారసత్వం ధర్మశాస్త్రం మీద ఆధారపడి ఉంటే, ఇక అది వాగ్దానం మీద ఆధారపడి ఉండదు; కానీ దేవుడు దయతో, ఆ వారసత్వాన్ని వాగ్దానం ద్వారా అబ్రాహాముకు ఇచ్చాడు.+
19 మరైతే, ధర్మశాస్త్రం ఎందుకు? దేవుడు ఎవరి గురించైతే* వాగ్దానం చేశాడో ఆ సంతానం* వచ్చేవరకు,+ మనుషుల పాపాల్ని వెల్లడిచేయడానికి ధర్మశాస్త్రం ఆ తర్వాత ఇవ్వబడింది.+ అది దేవదూతల ద్వారా+ మధ్యవర్తి చేత+ ఇవ్వబడింది.
20 అయితే రెండు పక్షాలు ఉంటేనే మధ్యవర్తి అవసరం, కానీ వాగ్దానం చేసింది దేవుడొక్కడే.
21 మరైతే ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు విరుద్ధంగా ఉందా? ఎంతమాత్రం లేదు! ఎందుకంటే, జీవాన్ని ఇవ్వగలిగే ధర్మశాస్త్రాన్ని ప్రజలు అందుకొని ఉంటే, వాళ్లు దాని ద్వారానే నీతిమంతులుగా ఎంచబడి ఉండేవాళ్లు.
22 అయితే లేఖనాలు ప్రతీ ఒక్కర్ని పాపం అధీనంలో ఉంచాయి. యేసుక్రీస్తును విశ్వసించడం వల్ల వచ్చే వాగ్దానాన్ని,* విశ్వాసం చూపించేవాళ్లు పొందాలని అలా జరిగింది.
23 అయితే విశ్వాసం* రాకముందు మనం ధర్మశాస్త్రానికి అప్పగించబడి, దాని చేత సంరక్షించబడుతూ, వెల్లడికాబోయే విశ్వాసం కోసం ఎదురుచూస్తూ ఉన్నాం.+
24 కాబట్టి, మనం విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్పు తీర్చబడేలా,+ క్రీస్తు దగ్గరికి నడిపించడానికి ధర్మశాస్త్రం మనకు సంరక్షకునిగా* పనిచేసింది.+
25 కానీ ఇప్పుడు విశ్వాసం వచ్చేసింది,+ కాబట్టి ఇక మనం సంరక్షకుని* కింద లేము.+
26 నిజానికి, క్రీస్తుయేసు మీద ఉన్న విశ్వాసం ద్వారా మీరంతా దేవుని పిల్లలు.*+
27 ఎందుకంటే, బాప్తిస్మం తీసుకుని క్రీస్తుతో ఐక్యంగా ఉన్న మీరంతా క్రీస్తును* ధరించుకున్నారు.+
28 ఇందులో యూదులు-గ్రీకువాళ్లు,+ దాసులు-స్వతంత్రులు,+ స్త్రీలు-పురుషులు+ అనే తేడా లేదు. ఎందుకంటే క్రీస్తుయేసు శిష్యులుగా మీరంతా ఒక్కటిగా ఉన్నారు.+
29 అంతేకాదు మీరు క్రీస్తుకు చెందినవాళ్లయితే, మీరు నిజంగా అబ్రాహాము సంతానం,*+ అలాగే వాగ్దానం+ విషయంలో వారసులు.+
అధస్సూచీలు
^ అక్ష., “మీ నుండి నేర్చుకోవాలని.”
^ అనుబంధం A5 చూడండి.
^ లేదా “లెక్కించాడు.”
^ అంటే, ధర్మశాస్త్రాన్ని.
^ లేదా “ఉపమానం.”
^ లేదా “నిబంధన.”
^ అక్ష., “విత్తనానికి.”
^ అక్ష., “విత్తనాలకు.”
^ అక్ష., “విత్తనానికి.”
^ అక్ష., “ఎవరికైతే.”
^ అక్ష., “విత్తనం.”
^ లేదా “వచ్చే వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాన్ని.”
^ ఇది క్రైస్తవ విశ్వాసాన్ని సూచిస్తుందని స్పష్టమౌతోంది.
^ లేదా “బాల శిక్షకునిగా.”
^ లేదా “బాల శిక్షకుని.”
^ అక్ష., “కుమారులు.”
^ లేదా “క్రీస్తు వ్యక్తిత్వాన్ని.”
^ అక్ష., “విత్తనం.”